అక్షరాలునేర్చి ఆశ్చర్య పడునాడు - తెలుయునెంత గలదొ తెలుసుకొనగ - వింతతరగదయ్య విఙ్ఞానికెన్నడూ - అప్రమేయ వరద హరిముకుంద (పరాక్రి)
పదనిసలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పదనిసలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

మిత్రులందరీకి మహా శివరాత్రి శుభాకాంక్షలు




మిత్రులందరీకి మహా శివరాత్రి శుభాకాంక్షలు
శివుని పేరు మీద చిద్విలాసము లొప్ప
ఈప్సి తార్థ వర్త ఈ స్వరమున
జాగరంబు సేయు జనములు జగమున
అప్రమేయ వరద హరి ముకుంద ||
--- పరాక్రిజయ

See My 4 Blogs - P.V.Radhakrishna cell:9966455872
Like the face book page : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAY…,

5, ఫిబ్రవరి 2014, బుధవారం

సమైక్యాంధ్ర లో శ్రీ మదాంధ్ర భాగోతం

సమైక్యాంధ్ర  శ్రీ మదాంధ్ర భాగోతం
part 1 Dt. Sep 27, 2013 

part 2  (NEW) Dt. 04/02/2014 

 పోతన వ్రాతగాదె తలపోతల కూతల చేతనంబుతో
నీత సమైక్య రాగ ముదయించెను భావితరాల కోశమై
నూతన శీర్షికా ప్ర కట నుద్యమ భాషల భేష జంబుతో
జూతురు సమైక్యమన్న జన జృంభిత గుంభిత భావజాలమున్ //

రాజరికము పోయె రాజ్యంబు గలదేని
ప్రజల సామ్యమొచ్చె ప్రభుత కొరకు
రాజకీయమందు రాక్షస క్రీడలా 
నాడు పాడిగాదు నేడు నదియె //

తంత్రమేది గాని తాదాత్మ్యమొక్కటే
స్వేచ్ఛలేని నాడు కుచ్ఛితంబు
తుచ్ఛమైన దాని తూతూల మంత్రాన 
సాగమింతునేమి బాగుగలదె //

మూడు ముక్కలాట ముచ్చట గొల్పుచో
ఆటగానె జూతురాంధ్రులెపుడు
పాటు గల్గునాడు పాల్గొనకుందురా
తాట నిలపగలరు తపన నొడమి //

ఉన్నది ఉన్నది గానొప్పు 
కన్నుగవంటేనె రెండు గానుటకొప్పున్
తిన్నగ జూడని పక్షము 
అన్నన్నా వెతల గోడు హస్తినకొచ్చెన్  (?) //

ముచ్చటింపుగాదు ముచ్చెమటలు బట్టు
మూర్ఖ యోచనంబు మూర్కొనంగ
అచ్చతెనుగు నేల నిచ్చకంబులదేల
సాధ్యపడదు మీకు భాద్యులార // 
__________________________________________________

సమైక్యాంధ్ర  శ్రీ మదాంధ్ర భాగోతం part 2
Dt. 04/02/2014 

హస్తిన మస్తకాప్రబల హస్తపు, చేతల ఢుల్ల దెెల్లమౌ
ఆస్తుల పంపకాన సరియానదు, సుప్తనిరస్త స్వస్థతల్
దోస్తులు మెచ్చబోరు, భరతోర్విని గర్విత భావజాలముల్
ప్రస్తుత శ్రీమదాంధ్ర విభప్రాభవ భంజన సాధ్యమేరికిన్ ||

యుద్ధ ప్రాతిపథికను సం సిద్ధమైన
హైదరాబాదను జిహాదు పాదుకొనును
కొత్తరాష్ట్రమ్ము యేరికి గోరికయ్య
నిక్కమెన్నిక ! కలలన్ని  నిజముగావు ||

అంతరాయ మొచ్చి ఆగిపోవును గాత !
తెలుగు నేల జిచ్చు దెప్పరిల్ల
స్వచ్ఛమైన దాని యిచ్ఛలు నేరవేర
ఆంధ్ర వాణి పటిమ యగును నిజము ||  


27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

సమైక్యాంధ్ర లో శ్రీ మదాంధ్ర భాగోతం



సమైక్యాంధ్ర  శ్రీ మదాంధ్ర భాగోతం


 పోతన వ్రాతగాదె తలపోతల కూతల చేతనంబుతో
నీత సమైక్య రాగ ముదయించెను భావితరాల కోశమై
నూతన శీర్షికా ప్ర కట నుద్యమ భాషల భేష జంబుతో
జూతురు సమైక్యమన్న జన జృంభిత గుంభిత భావజాలమున్ //

రాజరికము పోయె రాజ్యంబు గలదేని
ప్రజల సామ్యమొచ్చె ప్రభుత కొరకు
రాజకీయమందు రాక్షస క్రీడలా 
నాడు పాడిగాదు నేడు నదియె //

తంత్రమేది గాని తాదాత్మ్యమొక్కటే
స్వేచ్ఛలేని నాడు కుచ్ఛితంబు
తుచ్ఛమైన దాని తూతూల మంత్రాన 
సాగమింతునేమి బాగుగలదె //

మూడు ముక్కలాట ముచ్చట గొల్పుచో
ఆటగానె జూతురాంధ్రులెపుడు
పాటు గల్గునాడు పాల్గొనకుందురా
తాట నిలపగలరు తపన నొడమి //

ఉన్నది ఉన్నది గానొప్పు 
కన్నుగవంటేనె రెండు గానుటకొప్పున్
తిన్నగ జూడని పక్షము 
అన్నన్నా వెతల గోడు హస్తినకొచ్చెన్  (?) //

ముచ్చటింపుగాదు ముచ్చెమటలు బట్టు
మూర్ఖ యోచనంబు మూర్కొనంగ
అచ్చతెనుగు నేల నిచ్చకంబులదేల
సాధ్యపడదు మీకు భాద్యులార //



9, సెప్టెంబర్ 2013, సోమవారం

24, ఆగస్టు 2013, శనివారం

అప్రశిఖ కథ

అప్రశిఖ కథ

అనగా అనగా రాజ్యం లో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వారిద్దరికి ఇద్దరు పుత్రులు. తమ పిల్లలు మంచి విద్యావంతులు కావలని వారికోరిక. వారికోరిక కు తగినట్లు తమ రాజ్యానికి దూరంగా మహాముని ఉన్నాడని అతడు సకల శాస్త్ర పారంగతుడని తెలుసు కున్నారు.

        పూర్వం విద్యాభ్యాసానికి గురు కులాలకు విదార్థులు వెళ్ళి విద్యను అభ్యసించే వారు. కావున తమ పిల్లలును కూడా దూర దేశాలకు పంపి విద్యావంతులని చేయాలని వాళ్ళు అకాంక్షించారు. మిత్రుల ఇద్దరి పిల్లలు "అజేయుడు - విజేయుడు" కూడా స్నేహంగా ఉండేవారు. ఏలాగైతేనేం పిల్లలకు కూడా దేశాటన చేసి విద్యా విఙ్ఞానాలను సముపార్జించాలని కోరిక కలిగింది. వారి కోరిక మేరకు వింధ్యాటవిలో విద్యా నంద స్వామి వద్ద కావ్యాలంకార తర్క మిమాంశాది అనేక శాస్త్ర విషయాలు నేర్చుకొని పెద్ద వారై "అజేయుడు - విజేయుడు" ఇంటి ముఖం పట్టారు.

       అయితే, దారిలో అనేక రాజ సంస్థానాలలో వారి ప్రతిభా పాటవములను మెచ్చు కొంటూ అనేక రాజన్యులు సత్కారములు విలువైన కానుకలు సమర్పించారు. వచ్చిన వన్నీ "విజేయునికి" మాత్రమే అజయునికి ఏమీ రాక పోవడం తో మాత్స్యర్యంతో తన మిత్రుడైన విజయుని చంపాలని నిశ్చయించు కున్నాడు.  తన మిత్రునికి విషయం చెప్పి మరీ చివరి మాటగా మీ తల్లి దండ్రులకు ఏం చప్ప మంటావ్. నువ్వు గొప్ప పండితుడివే కావచ్చు, ఈ కానుకలు నాకే వచ్చాయని చెప్పవచ్చు అయిన నువ్వు నేను ఒక చోట ఉంటే నేను నీ కంటే గొప్ప వాడిని కాలేను. చివరి సారిగా ఒక అవకాశం నీకిస్తున్నా. కాని నువ్వు చెప్పే మాటలో నేను నిన్ను చంపుతున్నాననే అర్థం ఉండకుండా చెప్పు " అని అన్నాడు అజేయుడు.

 విజేయుడు "అప్రశిఖ" అని చెప్పాడు 

 శ్లో | |  నేన తవ పుత్రస్య |
        ప్రసుప్తస్య వనాంతరే | |
        శిఖ మాక్రమ్య పాదేన | 
        డ్గేన శిరః ఖండితః | |    

 అనువాదం : -  శ్రీమతి జయ మహేశ్వరి
  య్య గురు వాఙ్ఞ నిలు జేర నరయు చుంటి |
  ప్రతిభ నోర్వక పగను కారడని మధ్య | |
  శిఖను కాలి తో త్రోక్కుచు సిగ్గు విడిచి |
  డ్గమున  మిత్రుడే నన్ను కాల పరిచె | |
  
 అజయుడు మోసు కొచ్చిన సందేశం కాల క్రమంలో అతని మోసం 
బయట పడతాయి. తెలివైన వాని మాటలు ఏ నాటికీ నిలిచిపోతాయి.
 నిజం నివురు గప్పిన నిప్పే కదా ||

4, ఆగస్టు 2013, ఆదివారం

కోడినక్కపిల్ల కథ

 కోడినక్కపిల్ల కథ
                 లోకంలో అదృష్టవంతులతో పాటు అమాయకులు ఎందరో ఉంటారు. అమాయకులతో పరాచకాలు ఆడితే  కొన్ని సందర్భాలలో  ప్రమాదాలు కూడా ఏర్పడతాయి. ఈ కథనంలో అనగనగా ఓ అమాయకుడు !
అతని పేరు "అబద్ధం"   పేరేంటి ఇలా ఉంది అనుకోకండి. అతని తల్లిదండ్రులకు ఎంతో కాలానికి లేక లేక పుట్టిన సంతానం. అబద్ధం అని పేరు పేడితే మంచి ఆయుర్ధాయం కలవాడు అవుతాడని  ఓ సాములోరు చెప్పడంతో తమ సంతానం నిలబడ్డానికి ఈ పేరే ఖరారు చేసుకున్నారు అతని తల్లిదండ్రులు అతను పుట్టడానికి ముందే.

                 అబద్ధం నిజంగానే అబద్దాలు తెలియని అమాయకుడు. పెళ్ళీడు రావడంతో అతనికి పెళ్ళిచేసి తొలి పండగకు అత్తవారింటికి పంపదలచింది అతని తల్లి.ముందుగా కొన్ని సూచనలు చేసింది.

            ఓ రేయి "అబద్ధం" నొటిలో వేలు పెడితే కొరకడం కూడా తెలియని నీ అమాయకత్వాన్ని చూస్తే జాలేస్తోంది.
దానికి తోడు మృదువుగా  మాట్లాటడం కూడా నీకు నేర్పలెమో ? నీ మాటలలో కల్మషం లేక పొయినా.............. కఠినంగా మాట్లాడకూడదురా , అత్తవారింటికి కూడా వెళుతున్నావు ఎక్కువగా మాట్లాడకుండా ముచ్చటగా మూడు మాటలు మృదువుగా మాట్లాడు. అంటూ తల్లి హితబోధలు చేసింది. నీ తండ్రి పోయి ఏడ్నార్ధం అవుతోంది. నేనెంత కాలమో........? కాస్తా తెలివిగా ఆలోచించి అన్నిపనులు చూసుకుంటూ ఉండాలి. రామాపురం వెళ్ళి నీ భార్యను తెచ్చుకుని ఇక్కడ హాయిగా జీవించు. నేనా కాశీకి పొతున్నాను. అంటే కాటికి పోవడం లాంటిదేరా! భార్యతో కూడా మృదువుగా మాట్లాడుతూ నీ పనులు చెక్కబెట్టుకోవాలి. నేను మళ్ళీ తిరిగి వస్తానని ఆశించకు.

                   అమాయకుడు అయిన అబద్ధానికి తల్లి మాటలలో మృదువుగా అన్న పదం బాగా నచ్చింది. మెత్తగా ఉండేవి ఏమిటా అని తెగ ఆలోచించాడు. అవి కూడా మూడు కావాలి కదా. ఇల్లంతా కలయ దిరిగి మొత్తానికి ఎలాగయితేనేమి మెత్తగా ఉండే మూడు పదాలను పట్టుకున్నాడు. మొదటగా తణివి చూసి మరీ ఆ..... దూది మెత్తగా ఉంది. తరవాత వెన్న మెత్తగా ఉన్నట్లు తోచింది. పెరట్లోకి వచ్చి వెతికాడు కట్టేసిన దున్నపోతు ముడ్డిమీద చెయ్యి వేసాడు అరే ఇదికూడా మృదువుగానే ఉంది. అమ్మయ్య... నాకు కావల్సిన మూడు మాటలు దొరికేసాయి. అనుకుని అత్తవారింటికి పయనమయ్యాడు.
                        రామాపురం చేరుతూనే మూడు మాటలూ నెమరు వేసుకుంటూ అత్తవారింట్లో ప్రవేశించాడు. అంతా చుట్టూ చేరారు, బాబూ బాగున్నారా!  అత్తమామలు పలకరించారు. బావా బాగున్నావా ! ముగ్గురు బామ్మర్దులు ముక్త కంఠంగా పలకరించారు. చిన్నా పెద్దా అంతా మాటాడండి బాబూ అంటూ చుట్టుముట్టారు. భార్య వైపు ఓ చూపు చూసి మిన్నకున్నాడు అబద్ధం . ఏమండి చెప్పండీ లేకపోతే నీ మొగుడు దద్దమ్మే అంటూ నన్ను వెక్కిరిస్తారంతా, ఏం చెప్పాలో తెలీక భార్య వైపు గిరుక్కున తిరిగి చురుక్కుమనేలా చూస్తూ...... ఏం చెప్పమంటావే దూది, వెన్న, దున్నపోతుముడ్డి చాలా? 
               అల్లుడు గారు ప్రయాణ బడలికలో ఉన్నారని గ్రహించి అతని మాటలు పట్టించుకోకుండా తమ ఆతిథ్యానికి మురిసిపోవాలని భావిస్తూ అంతా సపర్యలు చేసారు. బావమరుదులు కూడా అనునయంగా మాట్లాడుతూ  బిగుసుకున్న అతని బిడియాన్ని సడలించే ప్రయత్నంగా మర్నాడు సాయంత్రం వరకూ ఆగి తమ పొలానికి తీసుకెళ్ళారు. వాళ్ల పనీ అవుతుంది. బావగారికి వ్యాహ్యాళిగా ఉంటుందని వారి భావన.
                             ఆ.... ఊ..... అంటూ తప్ప అబద్ధం ఏమీ మాట్లాడలేదు. అంతా గమనిస్తున్న వాడిలా ప్రవర్తిస్తూ నేను పట్నపోడినని మీది పల్లెటూరని అనుకోపోతే ఈ విషయం చెప్పండి అని నోరు విప్పాడు. బావగారికి వ్యవసాయం గురించి తెలియదన్న సంగతి వాళ్ళు గ్రహించేసారు. ఇది శెనగ చేను అన్నారు కదా, మరి శెనక్కాయ లేవి అని ప్రశ్నించాడు అబద్ధం. కాయలు భూమిలో ఉంటాయ్ బావగారూ!నీజం చెప్పినా తనను ఆటపట్టిస్తూన్నారు అనుకున్నాడు "అబద్ధం". నేల లోన్చి కాయలు పీకి తాటికమ్మలేసి కాల్చి ఇచ్చే వరకు అతని ఆశ్చర్యనికి బావమరుదులు అబ్బుర పడ్డారు. 

                    ఇంతలో చీకటి పడడం తో బుడ్డి దీపాలు వెలిగించేరు అంతా! పట్నంలో పెరిగిన అమాయకత్వం చేత ఇవెలా వచ్చాయి అని అడిగాడు "అబద్ధం". వేళాకోళం ఆడాలనిపించి వీటిని కోడినక్కపిల్లలంటారు బావా! ఇవి మన కళ్ళం లోనే పండుతాయి. మరెక్కడా పండవు. రహస్యంగా అన్నారు. అయితే నాకోటియిద్దురు. కరెంటు పొయినప్పుడు మాకు ఉపయోగపడతాయి. అలాగే తప్పకుండా....మీరు పట్నం వెళ్ళేటప్పుడు సారేలో పెట్టిస్తాం.
నవ్వుకుంటూ ముక్తకంఠంగా అన్నారు. వాళ్ళ మాటలు ఏందుకో నమ్మబుద్ధికాలేదు "అబద్ధానికి". సరే అంటూ ఇంటికి చేరుకున్నారంతా. రాత్రి భోజనాల దగ్గర కూడా కోడి నక్కపిల్లలు "అబద్ధానికి దర్శనమిచ్చాయి. భలే బాగున్నాయి అనుకున్నాడు మనసులో. మామ గారు అనునయంగా బాబు రేపు మంగళవారం మీరేమో రేపే బయలుదేరాలంటున్నారు ఓ పని చేయండి పిల్లని కొత్త కాపరానికి పంపించడం కదా పంతులు గారి చేత మూహూర్తం పెట్టించి మేము తీసుకొచ్చి దిగబెడతాం ప్రస్తుతానికి రేపు మీరు బయలుదేరండి, సారె, చీరలు పెట్టి అమ్మాయిని మీ ఇంటికి తీసుకొస్తాం. 
                                            

                మామగారు అన్నమాటల్లో మీరు రేపు బయలుదేరండి అన్నప్పుడు అబద్ధానికి టక్కున ఓ అనుమానం మెరిసింది. సారె తెస్తారు సరే మరి కోడినక్కపిల్లనిస్తారా? బావగారు చమత్కారులే అందరూ ఫక్కున నవ్వుకున్నారు. రాత్రి పడుకున్నా నడిరేయి దాటినా అబద్ధానికి మాత్రం నిద్ర పట్టలేదు. అందరూ నవ్వుకున్నారన్న ఉక్రోషం పట్టలేక పోయాడు. వీళ్ళకి చెప్పీ పెట్టకుండా కోడినక్కపిల్లను మాత్రం పట్టుకుపోవాలని నిశ్చయించుకున్నాడు. ఎదురుగా మినుకు మినుకు మంటూ కనిపిస్తున్న కోడినక్కపిల్లని తన చేతిసంచీని భద్రంగా ఆ తాటాకుల ఇంట్లో వీధి చూరులో పెట్టి మెల్లగా ఓ రెండు గంటలు కాలక్షేపం చేసి వెళ్లి పోవాలనుకున్నాడు. ఇంతలో నిద్రా దేవత అతణ్ణి ఒడిలోకి తీసుకుంది.  

                   తెలివొచ్చేసరికి పెద్ద కేకలు హాహాకారాలు మంటలు వాటినార్పుతున్న బామ్మర్దులు. అబద్ధం మాత్రం చూరుదగ్గర నిశితంగా వెతుకుతున్నాడు. బాబూ ఏం వెతుకుతున్నారు? మామగారు ప్రశ్నించారు, అదే ఆ కోడినక్కపిల్ల ఈ చూరుక్రింద పెట్టానన్న అతని మాటలతో బిగ్గరగా కేకలేస్తూ ఒరేయ్! మీ బావ కొంపలంటిచేసాడురా, వెధవ వేళాకోళాలూ మీరూ................. ముక్కుమీద వేలేసుకుంటూ బిక్కుమనకుండా అంతా నిశ్శబ్ధం..... 
              తెలివితక్కువ తనం ఎంత ప్రాణాంతకమౌతుందో.........??? అలాగే తెలివైనవాడు మరణించినా తను మనుగడను సూచిస్తాడు." అప్రశిఖ " కథనంలో తెలుస్తుంది. మళ్ళీ ఆ కథనంతో కలుద్దాం....


22, జులై 2013, సోమవారం

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3

  ఈ కథను మూడు భాగాలుగా చేసి ప్రచురించడం జరిగింది. కాబట్టి వరుస క్రమాన్ని పాఠించండి.

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3   (you are here)

 పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3 

                        మన వస్తాదు పని మూడు పువ్వులు ఆరు కాయలు గా ఉంది.రాజు గారితో కూడా స్నేహం బాగా ముదరడంతో రాచకార్యల లోను మంచి ప్రధాన్యత లభించింది. ఓ రోజు మంతనాలాడుతు  అశ్వ శాలకు తీసుకొచ్చి రాజు ఇలా అన్నాడు. నూటికి వస్తాదు గారూ పక్క రాజ్యపు రాజు మన మీద కత్తికట్టాడు. యుద్ధానికి సిద్ధం కమ్మన్నాడు నేను వేగులను పంపి తెలుసు కున్న విషయమేమిటంటే అశ్వ గజ పదాతి దళాలు అన్నీ అతనితో సమానంగా ఉన్నాయి. కాక పోతే పదాతి దళంలో ఓ యాభై మంది తక్కువ కాని వంద మంది పెట్టు మీరున్నారుగా ........కావున మీకు కావలసిన గుర్రాన్ని మీరు ఎంపిక  చేసుకోండి. యుద్ధానికి తరలి వెళదాం. 

   ఇరకాటకంలో పడిన వస్తాదు చప్పున ఓ కుంటి గుర్రాన్ని ఎంచుకొని తాను నక్కచ్చు కదా ! అని భావించాడు. యుద్ధం అనే మాట వినగానే రాజు గారి పంచకళ్యాణి నేలను థాటించి కాలుదువ్వుతూ రాజుగారికేసి వస్తాదుకేసి ఉరిమి చూసింది. అది కుంటిగుర్రమనుకున్నాడు మన వస్తాదు. రాజా! ఈ గుర్రాన్నిప్పించండి. రాజు వస్తాదు సమయస్ఫూర్తికి అభినందిస్తూ సెహభాష్ ! నా గుర్రాన్నే ఎంచుకున్నారు. మన సైన్యాధ్యక్షుడితో పాటు ముందుండి వ్యూహరచన చేస్తూ సైన్యాన్ని నడిపించండి. నేను గజదళాన్ని నా అంబారీపై ఎక్కి వస్తూ నడిపిస్తాను. కానీ తమరు పదాతి దళంపై దృష్టిపెట్టి ఉండండి. రాజు మాటలకు ఏమనాలో తోచక మనకి విజయం తథ్యం అంటూ గుర్రాన్ని ఇంటికి తోలుకు పోయాడు.

                 భార్యతో "నేను భారీ విగ్రహాన్నైతే  పెంచానుగానీ కనీసం ఈ గుర్రాన్ని స్వారీ చేయగలనంటావా" అంటూ దానిపై ఎక్కి కళ్ళెం పట్టుకుని ఎందుకైనా మంచిది ఈ గుర్రం పైనుండి పడిపోకుండా దీని జీనుతో పెద్ద చాంతాళ్ళేసి గట్టిగా నా కాళ్ళు కట్టు అన్నాడు. అబ్బో మీ బుర్ర బాగా పెరిగిందండీ అంటూ అభినందించి కదనరంగానికి సాగనంపింది ఆ కాంతామణి. 

                    సుశిక్షితమైన గుర్రం అశ్వబలాలన్నీ వచ్చి చేరేదాకా మెల్లగా నడుస్తూ సైనికుల హాహాకారాలను అశ్వ హేషలను వింటున్నకొద్దీ తన వేగాన్ని పెంచింది. భయం కొద్దీ కళ్ళాన్ని బిగించి పట్టుకుంటున్నాడ వస్తాదు.  కళ్ళెం బిగించిన కొద్దీ గుర్రం దూసుకు పోతోంది. అశ్వసైన్యాలన్నీ ఆమడ దూరంలో గోచరిస్తూండగా దారీ తెన్నూ లేక అశ్వ హృదయాన్ని అర్థం చేసుకోలేక తాను జీనుకు కట్టుకున్న కట్లే ప్రతిబంధకాలుగా తయారవడంతో దారిలో ఎదురుగా కనబడ్డ ఓ రెండు పెద్ద తాటి చెట్లను కావలించుకున్నాడు వస్తాదు. గుర్రంకూడా కదలలేని స్థితిలో గింజుకుంటూంటే రెండు చంకల్లో తాటి చెట్లను సమూలంగా ఊడబెరికి మరీ గుర్రం తన పరుగు లంఘించింది. 

               శతృసైన్యం దగ్గర పడుతోంది. చంకల్లో తాటి చెట్లతో ఆఘమేఘాల మీద దూసుకొస్తున్నాడు వస్తాదు. ఎదిరి సైన్యాలలో ఓ కలకలం. ఎవడ్రా వీడు యుద్ధానికి కత్తట్టుకొస్తారు, కర్రట్టుకొస్తారు. వీడేంట్రా బాబు ఏకంగా తాట చెట్లతో వస్తున్నాడు. 

                       ఛస్తాం రోయ్! నూటికొస్తాదంటే వీడే కామోసు మొదటి వరస వందమందికీ మూడినట్టే అంటూ వెనక్కి పరుగు తీసారు. మిగతా వారూ అదే భయంతో వెనకడుగే వేసారు. సైన్యం మొత్తం ఇట్లా తిరోగమనంతో వెనిదీయడంతో వాళ్ళ రాజ్య సరిహద్దులనే వాళ్ళు దాటిపోయారు. ఏం జరిగిందో ?.... జరుగుతోందో గ్రహించని నూటికొస్తాదు గుర్ర నురగలు కక్కుతూ కుప్పకూలిపోవడంతో ఆ నాటి యుద్ధం పరిసమప్తమైంది. 

                        ఆ రాజ్యానికి  నూటికొస్తాదే రాజ్య ప్రతినిధి అయ్యాడు. 

                  ఇప్పుడు చెప్పండి మాస్టారూ! యెర్రని యేగానీకి కూడా ఠికానా లేనోడు అదృష్టవంతుడైతే చాలు అందలాలెక్కేస్తాడు. రహీమ్ మాటలతో సాలోచనలో పడి మరి అమాయకుడైతే అందరికీ కష్టాలు నష్టాలు తెచ్చిపెట్టడా ???? 

                          కోడినక్కపిల్ల కథనంతో మళ్లీ కలుస్తా..........

 

 

 

 

14, జులై 2013, ఆదివారం

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

  ఈ కథను మూడు భాగాలుగా చేసి ప్రచురించడం జరిగింది. కాబట్టి వరుస క్రమాన్ని పాఠించండి.

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2  (you are here)

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3  

             పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

                        అంటూ నూటికొస్తాదుని తీసుకుని ఇల్లుచేరిందా ఇల్లాలు. ఉదయాన్నే ఇంటితలుపు తట్టాడు మంత్రి. ఆవలిస్తూ తలుపు తీసిన ఆవిడకి బారెడు పొద్దెక్కడం మంత్రి దర్శనం ఒక్కసారే ఎదురయ్యాయి. ఏమ్మా నిన్న రాజుగారు చెప్పక... చెప్పక... ఒక పని చెప్తే మీ ఆయన ఎక్కడికీ వెళ్ళకుండా ఇలా పడుకోడం బాగుందా, కనీసం నేనొచ్చాననైనా లేవకుండా ఉంటే మీకు దివాణంలో నౌకరీ ఊడినట్టే గదమాయింపుగా అన్నాడు మంత్రి. అంతే స్వరంతో చూడండి మంత్రిగారూ మా ఆయన నూటికొస్తాదు, యిరవై మంది దొంగలో లెఖ్ఖా.... ఎప్పుడో చంపి పడేసారు. రాత్రి రెండు, మూడు గంటలప్పుడనుకుంటాను ఇంటికొచ్చి ఇలా నిద్రోతున్నారు. లేపమంటారా. వద్దులేమ్మా నేనే ఆ దొంగలు చచ్చి పడిఉన్న ప్రదేశానికి వెళ్ళి చూసొస్తాను. పడుకోనీ పాపం. రాత్రి అలసిపోయి ఉంటాడు. 

                           మంత్రి నయగారానికి లోలోనే నవ్వుకుంటూ, మంత్రిగారూ మాకిక్కడ దినుసులకేం కొదవలేదుగానీ కొద్దిగా ఖర్చులుంటున్నాయ్ మరి తమరర్థం చేసుకోవాలి. తటపటాయించకుండా కావ్చల్సింది అడిగేసింది వస్తాదు భార్య. దాంతో వెండి మొహరీలు నెలకో వంద చొప్పున వారి కుటుంబానికి అందేవి. దాంతో ఇంట్లో నౌకర్లను కూడా పెట్టుకుని సౌఖ్యవంతమైన జీవితాన్ని అనుభవించడానికి వీలైంది. మన వస్తాదు వర్యుడు కూడా ఒళ్ళంతా నూని పట్టించుకుంటూ అభ్యంగన స్నానాలు చేస్తూ రోజూ కోడి, గొర్రె లాంటివి మేస్తూ చూడగానే వస్తాదు అనిపించేలా తయారయ్యాడు. 

                             అన్నిరోజులూ ఒక్కలా ఉండవు గదా! మరలా వస్తాదుకు పని పడింది.  రాజే స్వయంగా పిలిపించి చెప్పాడు. ఊరిచివర యాతలు ఓ ఎలుగుబంటితో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కల్లుకుండలన్నీ అది చిందర వందర చేసేస్తోంది. రాత్రుళ్ళు మరీ దాని ఆగడాలకు అంతులేకుండా ఉందట. మన సైనికులని పది మందిని పంపా కానీ ఏం ప్రయోజనం ఎలుగుబంటి చేతిలో కొందరు చచ్చి కొందరు బతికి వచ్చారు. ఎలాగైనా నువ్వే వెళ్లాలి. నువ్వు వందమంది పెట్టు కదా అదే నా ధైర్యం వెళ్ళి దాన్ని చంపిరా.

                     రాజు ఆదేశానికి విచారంగా నెత్తిన గుడ్డేసుకుని భార్యతో ఇలా అన్నాడు వస్తాదు. ఒసే ఇంకీ దివాణంలో మనకి నూకల్లేవే. మనుషులు కూడా కాదు జంతువుని నేను చంపాలంట. పద ఈ రాత్రికే పారిపోదాం. అమావాస్య, ఆదివారం అని నిర్ఘ్యాలు పెట్టకు. ఉన్నపళంగా కట్టుబట్టలతో పదండి. పెరటిదారిన తాటితోపుల మధ్యగుండా ఒకరిచేయి ఒకరు పట్టుకుని పారిపోదాం. 

                   వాళ్ళు వెళుతున్నారు...... అసలే రాత్రి అందునా అమాస, వస్తాదు ఒకవేపు చేతినే కాకుండా రెండో చేతిని కూడా ఎవరో పట్టుకుని గుంజుతున్నట్ల నిపించి భార్య చేయి వదిలేసి ఎలుగుబంటిని కాగలించుకున్నాడు వస్తాదు. ఏవండోయ్! అది ఎలుగుబంటిలాగుంది పరుగెత్తండంటూ పిల్లలను కాచుకుంటూ ఓ పొదలో దాగింది అతని భార్య. చురకత్తిపై చేయివేసి ఎలుగుబంటిని విడిపించుకుని  పక్కనున్న చెట్టుకు ఎగబాకాడు వస్తాదు. చెట్లెక్కడం ఎలుగుకుమాత్రం రాదా ఏమిటి? .....

                   కానీ అది విచిత్రంగా ఎక్కుతుంది. తలక్రిందులుగా... వస్తాదును సమీపిస్తున్న కొద్దీ.... చెట్టుపైకి పాకడంలో అతని చురకత్తి కాస్తాజారి ఎలుగు ముడ్డిలో దిగబడిపోయింది. నిశ్శబ్ధంగా దబ్బుమనే శబ్ధం తప్ప అతడికేమీ కనిపించలేదు. కిక్కుకిక్కు మని ఘుర్జరిస్తూ  చచ్చింది ఎలుగు. ఓ అర్ధగంట సద్దుమణిగాక మొదటగా తేరుకున్న అతని భార్య ఎలుగు రక్తపు మడుగులో పడి మరణించిందని ధృఢపరుచుకుని భర్తకై కేకలేసింది. నేనిక్కడే చెట్టుమీదే ఉన్నానే.... పర్లేదు దిగండి... అది చంపేస్తుందే... అదే చచ్చి పడింది... మీరు నన్ను చంపక  చెప్పింది చేయండి. ముందా చెట్టు దిగండి. 

                    కొందరికి అదృష్టం ఆతుల్లో పట్టడమంటే ఇదేనేమో ..... భార్యా భర్తలు మరలా దివాణం కేసి అడుగులేసారు. మర్నాడు మంత్రి పిలవడం - రాజసభకు వెళ్ళి వస్తాదు రాత్రి తలగడ పాఠాన్ని తూ.చ తప్పకుండా అప్పగించడం జరిగింది. ఎలుగును చూసిన రాజు పొంగిపోతూ, మన నూటికొస్తాదు ఎంత సూటిగాడోయ్ అమావాస్య రాత్రిలో కూడా కత్తి విసిరాడంటే ఏమనాలి .... ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంది. ఓ సన్మాన సభ ఏర్పాటుచేసి పులిగోరు పతకంలా... ఎలుగ్గోరు పతకం చేయించి మెళ్ళోవేసి, ఇతనికీ నెలనుంచి వెండి మొహరీలే కాదు బంగారు మొహరీలు కూడా ఇవ్వండని ఆదేశించి ఆ నాటి సభ ముగించాడు. 

                                             .................................సశేషం    

10, జులై 2013, బుధవారం

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు

ఈ కథను మూడు భాగాలుగా చేసి ప్రచురించడం జరిగింది. కాబట్టి  వరుస క్రమాన్ని పాఠించండి.

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు(you are here)

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 2

పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు 3                               

                 పరాక్రి పదనిసలలో.... నూటికి వస్తాదు
                         అదృష్టవంతుడు అంబులెన్స్ క్రింద పడతాడన్నది నేటి సామెత. ఎర్రని యేగానికి కూడా చెల్లుబాటు కాని వాడు అందలాలెక్కాడంటే అది అదృష్టమనే అనుకోవాలి. "నెత్తిమీద రూపాయిపెట్టి పావలాకమ్మినా చెల్లవురా " అని పెద్దలు తిట్టడం నాకు బాగా గుర్తుంది. ఈ రోజుల్లో యేగాని గూర్చిగాని కానీ, దమ్మిడీ, డబ్బు, పైసా లాంటి పదాలు నేటి తరానికి అందుబాటులో లేనివి. చెల్లుబాటుండాలి కానీ విషయమేదైనా..... ? విన ఆశక్తిగానే ఉంటుంది. 
                        కన్నూరుపాలెం అనే కుగ్రామంలో నాకు కో టెనెంట్ గా" పీర్ బీ-- రెహమాన్ " అనే సాయిబు దంపతులు ఉండేవారు. వెన్నెల వాకిట్లో పడుకుని "శారదరాత్రులుజ్వల లసత్తర తారక హారపంక్తులన్" అనే నన్నయగారి పద్యం బిగ్గరగా పాడుకుంటున్నాను. రెహమాన్ పంతులుగారూ నేనో కథ చెబుతాను అన్నాడు. అక్షరం ముక్క కూడా రాని అతగాడి కుతూహలాన్ని గమనించి సరే నీభాషలో చెప్పు  అంటూ శ్రోతగా విన్నాను ఈ నూటికొస్తాదు కథ.
                        కథాకమామీషు ఏంటంటే ................................
                        ఓ మారాజుగారుండే రాజ్యంలో...... నాబోటి అమామీకుడొకడు తన భార్యా పిల్లలతో కలిసి ఓ సత్రంలో బసచేయడానికొచ్చాడు. ఆడొట్టి బద్ధకస్తుడు. ఏ సంపాదనాలేని పేదోడు. రోజువారీ సంపాదన సేతకాని ఆడితో ఆయమ్మ ( వాడి భార్య లెండి ) ఏదో ఏగుతోంది. సత్రంకూడు, మఠం నిద్రచేస్తూ రోజులు గడిపేత్తన్నారు. 
                            ఆదేశపు మారాజుగారికి మంత్రిగారితో కలిసి పుర ఈదుల్లో మారేశాలేసుకుని తిరుగుతూ.... పెజలేటనుకుంటున్నారో  తెల్సుకోడం ఓ యిదిగా ఉండేది. మన అమామీకుడున్నాడు కదండీ ( వాడికేం పేరుపెట్టలేదు ) ఆడికి దారిలో యేగాని దొరికినాది. దాంతో సుట్టముక్క కొనుక్కుంటానని ఆడంటే, ఆడి పెల్లం ఒల్లకో ఆ డబ్బియ్యి ఈ రోజు రేతిరికి పిల్లగాల్లకి తింటాని కేటీనేదు. అంటూ లాక్కుంది. ఓసె.... యేగానికేటొత్తాదే అనేలోపు మావా! సెట్టికొట్టుకెల్లి ఏదోటి అట్టుకొత్తానుగానీ సిటం ఆగవో అంటూ లగెత్తింది.  
                               అంత రాత్రిపూట ఓ ఆడది వీధులోకి వెళ్తుంటే ఏం జరుగుతోందో తెల్సుకోడనికి ఆ సత్రం ముందటే మాటేసి రాజూ మంత్రి గమనించసాగారు. ఆవిడ కోమటి కొట్టుకెళ్ళి పాకిపోయిన బెల్లం చవగ్గా వస్తోందని సెట్టినడిగి కొనుక్కొచ్చింది. అసలే ఆషాఢమాసం సత్రంలో ఈగలెక్కువ వాటిని తోలుకుంటూ ఈ బెల్లంతో ఏం చేద్దునా అని ఆలోచిస్తూ.....  తన భర్తకి ఈగల్ని తోలే పని అప్పగించి బిందట్టుకుని నీళ్ళకోసం వెళ్ళిందావిడ. 
                             పనిలేని మంగలి పిల్లి బుర్ర గొరిగేడన్నట్లు మనవాడు బెల్లంమీద వాలుతున్న ప్రతీ ఈగనీ ఠాప్.. ఠప్.. మని కొట్టి చంపి పడేస్తున్నాడు. దానికితోడు లెక్కపెడుతూ 1, 9,16 ,36, 52, 78, 93 అంటూ 99 ఈగను కూడా చంపి పడేసాడు. భార్య వచ్చిన అలికిడి విని బిగ్గరగా ఆగు అలాగ..... ఇప్పటికి 99 పేణాలు తీసాను నూటికొస్తాను అంటూ వందో ఈగనుకూడా ఠాప్ మనిపించేడు. చూసిన ఆవిడ అవాక్కై నించుని మావా! అయితే నూటికి వస్తాదువైపోయావు అంటూ బుగ్గలు నొక్కుకుని మెటికలిరిసింది. 
                                 వీరి మాటలు వింటున్న రాజు మంత్రితో ఇలా అన్నాడు. మన దివాణంలో వస్తాదులున్నారు గానీ..... వీడెవడో నూటికి వస్తాదునంటున్నాడు కాబట్టి అతనిని మన దివాణానికి తరలించే ఏర్పాటు చేయండి అని చెప్పి అంతః పురానికి పోయాడు . మంత్రి పల్లకీ పంపించి నూటికొస్తాదు దంపతులను దివాణానికి ఆహ్వానించాడు. ఆ రాజెవడో - ఈ మంత్రెందుకు పిలుస్తున్నాడో అర్థం కాకపోయినా అర్ధాకలితో నకనకలాడే వారి కడుపులు దివాణంలో అడుగు పెట్టడానికి సంశయించలేదు. మన నూటికొస్తాదు భార్య కాస్త గడసరిది...  లౌక్యం గలది. తన భర్తని వంద ప్రాణాలు తీసేసిన మొనగాడిగా, మొగాడిగా రాజూ, మంత్రి గుర్తించారని గ్రహించి పూర్తి విషయాన్ని తన భర్తకి కూడా ఉపదేశం చేసి మెల్లిగా కోట్లో పాగా వేసింది. 
                                    రోజులు, నెలలూ గడుస్తున్నాయి. దివాణంలో నివసిస్తున్న నూటికొస్తాదు దంపతులకు రోజులు బాగానే గడుస్తున్నాయి. ఏ రోజూ తిండికి వెతుక్కోనక్కర లేకపోయింది. కానీ అన్ని రోజులూ ఒకలా ఉంటాయా?  మంత్రి నూటికొస్తాదును పిలిపించాడు. రావోయ్..  వంద పేణాలు తీసిన మొనగాడా, ఈ రోజు నీకు పనిబడింది. మన రాజ్యం ఊరి చివర్లో ఓ 20 మంది దొంగలు దోచుకుంటున్నారు. రాజుగారు నిన్ను పంపమన్నారు. వారిని చంపమని. నీకదేమంత పని అనుకో చిటికెలో వందమందిని చంపగలవు. ఇదే రాజుగారు చెప్పిన మొదటి పని చేయలేదనుకో చాలా ప్రమాదం. జాగ్రత్త, అంటూ హుకుం జారీ చేసాడు. 
                                  ఇంటికొస్తూనే తుండుగుడ్డ నెత్తిమీద వేసుకుని - "మన పనైపోనాదే ఒకడుగాదు ఇద్దరుగాదు ఇరవై మంది దొంగలంట. నేనే చంపాలంట.మనకి నూకలు సెల్లిపోనాయి పద ఈ రేతిరికే ఎక్కడికేనా పారిపోదాం" అన్నాడు. కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా కలయదిరిగి రాత్రికి పారిపోవాలంటే ఏదో ఓటి చేయాలి. పిల్లలకి దారిలో ఆకలైతేనో అనుకుంటూ కొద్దిగా బెల్లం నూలుపప్పు రోట్లో వేసి చీకట్లో దంచనారంభించింది. అప్పటికే రోట్లో ఓ నాగుపాము తల దాచుకుంది. చూడకుండా గబగబా దంచేస్తూ ఉండలు కట్టి నూటికొస్తాదుతో బయలుదేరింది ఆ అనుంగు సతీమణి. అదేం చిత్రమోగానీ ఆ ఉండలుకూడా ఇరవైయ్యే అయినాయి. 
                                   రాజ్యం వదిలి పారిపోతున్న వీరికి దారిలో ఎదురయ్యారు ఆ ఇరవై మంది దొంగలూ. ఓయ్.. మీ దగ్గర ఏమున్నాయో  ఇలా ఇవ్వండి అంటూ బెదిరించారు దొంగలు. డబ్బూ దస్కం మా దగ్గరేం లేవయ్యా .... అనగానే మరా మూటేమిటి అంటూ ప్రశ్నించాడు దొంగల నాయకుడు. పిల్లలకి బెల్లపుండలు బాబూ.. అంటూ ఉండగా ఎక్కడ లాక్కుంటారో అని అతని భార్య కొంగుచాటున దాచుకుంది. దొంగల ఖర్మగాలి దాచుకున్న ఇరవై ఉండలూ బాగున్నాయంటూ తలకోటీ చప్పరించారు. గప్....చుప్.... మనకుండా నురగలు కక్కుకుంటూ ఇరవై మందీ కుప్పకూలిపోయారు. వాళ్ళనలా చూసి విస్తుపోయారు నూటికొస్తాదు దంపతులు. వేగంగా తేరుకున్న అతని భార్య ఉండల్లో విషం ఉందని  విషయం గ్రహించి భర్తతో ఏవండీ నయం మనం తిన్నాం గాదు. ఊరుదాటక ముందే చచ్చేవాళ్ళం. వీళ్ళచావు మన మంచికొచ్చింది. వీళ్ళని చంపమని గదా రాజుగారి ఆదేశం. అనుకున్నది అనుకోకుండా జరిగింది. ఇంక పారిపోనక్కరలేదు. పదండి దివాణానికి ................................
                                                                                                        సశే షం.                              

29, జూన్ 2013, శనివారం

పదనిసలు-4 వర్జ్యసంహారం

                                     వర్జ్యసంహారం      

  ప్రస్తుత కథాంశాన్ని చాలా రోజులుగా అందరితో పంచు కోవాలనుకుంటున్నాను. ఈ కథ కు  ఇతివృత్తం వర్జ్యం.  అనగా విడువదగిన సమయము అని అర్థం. మా తాతలలో ఒకరైన కీ|| శే||  పంతుల భాస్కరరావు గారు "వర్జ్య సంహార " కావ్యంగా ఛందోబంధాలలో చిత్రీకరించారు. కొండను త్రవ్వి ఎలుకను పట్టడం అనే సామెత మీరందరు ఎరిగినదే. కథా వస్తువు ఏదైనా హాస్యస్ఫోరకంగా రచించడంలో ఆయన దిట్టకవే.  


                       ఇక వర్జ్య సంహార కావ్యకథా వస్తువును కథగా చెప్పే ముందు ఓ రెండు మాటలు చెప్పాలి. నేనా కావ్యాన్ని చూడనూలేదు, చదవనూలేదు. ఇంట్లోవాళ్ళు ముచ్చటించుకునే సందర్భంలో కవిగారి చమత్కారం, హాస్య ఫక్కీ  నన్నెంతగానో ఆకర్షించేవి. వర్జ్యం, దుర్ముహూర్తం అనేవి మనం నేటికీ పంచాంగాలలో గమనిస్తూంటాం. అసలు పంచాంగం అంటేనే తిథి,వార,నక్షత్ర,యోగ,కరణాలు కదా. సమయ పాలనా సందర్భాన్ని పురస్కరించుకుని వారమునకు దుర్ముహూర్త కాలము, వర్జనీయ సమయములు సూచింపబడుతుంటాయి.ఈ నేపథ్యం నుండి వర్జ్య సంహార కథాసుధ ప్రావుద్భవించింది. 

                 అనగనగా ఓ రాజ్యాన్ని అయోమయం రాజు పాలించేవాడు. అతనిమంత్రి మరీ బుద్ధిహీనుడు, అయినా రాచకార్యాలు ఇతర ఉద్యోగులవల్ల సజావుగానే సాగుతూనే ఉండేవి . ఆ రాజ సభలో ఓ నిలయ విద్వాంసునిగా జోస్యుడొకడు పంచాంగం పఠించేవాడు. అందరితో పాటుగా "రాజు - మంత్రి" కూడా శ్రద్ధగా వినేవారు. పంచాంగంలోని వర్జ్యాన్ని గూర్చి రాజూ, మంత్రి తమ బుద్ధి సూక్ష్మతతో పరిశీలించారు. వార దుర్ముహూర్తం పద్ధతిగా రోజుకు బాగానే వస్తూంది. రాజన్నాడు కదా "ఓయి మంత్రి ఆ వర్జ్యం పద్ధతిగా లేదోయ్ మన పంతులుగార్ని ఓ సారి అడిగి దాన్ని సంస్కరించాలి." మంత్రి అంటాడు కదా "రాజా రామరాజ్యంలాంటి మీ ఏలుబడిలో అన్నీ సజావుగానే ఉండాలి. పద్ధతి తప్పి ప్రవర్తించే తీరు దేనికీ ఉండకూడదు. అనంత కాల విశ్వంలో పంతులుగారు చెప్పినట్లు నక్షత్రాలన్నీ మేకరాశి నుండి చేపరాశి దాకా పద్ధతిగా ఉంటాయి. గ్రహాలూ పద్ధతిగానే తిరుగుతుంటాయి. ఈ వర్జ్యం మాత్రమే అడ్డదిడ్డంగా దానికి నచ్చినప్పుడు వస్తూ పోతూ ఉంటుంది."

" మంత్రీ ! అదేనయ్యా నా బాధ ,  ఓ రోజులో చేసుకోవాలనుకున్న పనులకి ఇది మహా ఆటంకంగా ఉంది. పంతులుగారొచ్చి చెప్పేదాకా ఆ వర్జ్యం ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో తెలీదు. వార దుర్ముహూర్తంలా దానికి పద్ధతిలేదు. ఏం చేస్తే బాగుంటుందంటావ్", 
మంత్రి తటపటాయించకుండా టక్కున సమాధానం చెప్పాడు.

             " హే రాజన్ !   సజావుగా లేని వారికి మరణదండనే శిక్ష, కావున మీరు వెంటనే ఆ వర్జ్యాన్ని సంహరించాలి. పంతులుగార్ని వెంటనే ఆదేశిస్తాను వర్జ్యాన్ని పట్టుకురమ్మని."

 రాజు మనసు కుదుట పడింది." సరే ఈ రాత్రికే దాన్ని సంహరించేస్తాను. వెంటనే పంతులు గార్ని పట్టుకు రమ్మనండి." అంటూ అంతః పురంలోకి పోయాడు. 
                బుద్ధిహీనుడైన ఆ మంత్రి రెండో మాట మాట్లాడకుండా వర్జ్యాన్ని తెస్తావా ? చస్తావా ? అంటూ పంతులు గారికి పురమాయించాడు.

 పాపం ఆ బాపడు ఏం చేయాలో తోచక తన భార్యతో సంప్రదించాడు. సాయింత్రానికల్లా వర్జ్యాన్ని తేకపోతే దాన్ని సంహరించడం మాట ఏమోగాని ఈ సమస్య నా చావుకొచ్చింది. విచారిస్తున్న అతన్ని చూసి భార్య అన్నది కదా!

" ఏమండీ, వర్జ్యన్ని ఎవరు తేగలరు, అదేమైనా కందిపప్పు పొట్లమా కట్టుకు పట్టుకు పోడానికి, ఈ తలతిక్క వ్యవహారానికి కొద్ది మోసం జోడించి మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి కదా, నాకో ఆలోచన తట్టింది". అంటూ ఉపాయాన్ని సూచించింది.

 ఎలకల బోనులో  పడ్ద ఓ ఎలకకి జేగురు రాసి, పిండి చుక్కలు పెట్టి, బాగా ముస్తాబు చేసి భర్తకిచ్చింది. 

                 మన పండితులవారు రాజ సభకు తీసుకెళ్ళి తన బుద్ధికి పదునుబెట్టి ఇట్లా చెప్పాడు.

 "ఆర్యా ! మీరడిగారు గనక నా తపోశక్తిని ధారబోసి ఈ సారికి వర్జ్యాన్ని తెచ్చాను. మీకు తెలుసు కదా, దీనికి కుదురులేదు, దానికి నచ్చినట్లది ఎగురుతూ దుముకుతూ పరిగెడుతుంది. ఈ వర్జ్యాన్ని సంహరించడం ఇక మీ భాద్యత. మరలా తెమ్మంటే నా వల్ల కాదు." సంహరించండంటూ గుడ్డమూట విప్పాడు. 

ఇంకేముంది రాజ సభలో పెద్ద కలకలం. పట్టుకోండి ..  పట్టుకోండి ..  అంటూ అరుపులు రాజుగారి ఆఙ్ఞ , మంత్రిగారి ఆరాటం , సైనికులంతా వర్జ్యాన్ని వెతకనారంభించారు." రాజు నేనే సంహరిస్తాను , మీరుదాన్ని చంపకండి. అని ఆదేశించాడు. "
                          మూడు రోజులు నిద్రాహారాలు మాని దాన్ని వెంబడిస్తూ వీధులు, పట్టణాలు, పల్లెలూ గాలిస్తూ చివరికది ఓ కొండ బొరియలో దూరినట్లు గుర్తించారు. అక్కడ కొందరు కాపలాకాస్తూ రాజుకా వర్తమానాన్ని అందించారు. వర్జ్య సంహారానికి సిద్ధపడిన రాజు రాజ్యపాలన విధులన్నీ - మంత్రికి అప్పగించి ఆ కొండ బండలను బద్దలుగొట్టించే పనిలో పడ్దాడు. 
                             ఇది ఇలా ఉండగా రాణి వాసంలో  రాణీ గారిని తేలుకుట్టింది. తెలుసుకున్న మంత్రి వైద్యులకు కబురుపంపాడు. సమయానికి వారందుబాటులో లేకపోవడంతో వైద్యనాథుల శిష్యులు విషం తలకెక్కకుండా చూసుకోండి, మా గురువుగార్ని త్వరగా తీసుకొస్తాం అని వార్తాహరులను సమాధాన పరిచి, గురువుగారి దగ్గరకు వెళ్ళారు. 
                  రాణిగారు తేలువిషం సలపడంతో గోలగోల చేస్తూ ఉంటే మంత్రి తన బుర్రకు పదును బెట్టి వైద్యనాధ శిష్యులు చెప్పిన ప్రకారం తలనుండి మొండెం వేరుచేసి విషం తలకెక్కకుండా జాగ్రత్త పడేటట్లు ఆదేశించాడు. వైద్యనాథులు ముహూర్త సమయంలోనే అంతఃపురానికి వచ్చినా మంత్రిచేసిన అఘాయిత్యం గ్రహించి, 

"అబ్బే లాభం లేదండి చూడండి ముఖం వాడిపోయింది విషం తలకెక్కేసింది." అని చెప్పి తప్పించుకున్నారు. 

                 మంత్రికి ఏం చేయాలో పాలుపోలేదు. రాణిగారికి సంతానం లేదు, రాజుగారా.. వర్జ్యసంహారంలో ఉన్నారు. అంతఃపుర కాంతలను వేలేసి తాకరాదుకదా.. గంధం చెక్కలు తెప్పించి రాణివాసాన్నే తగలెట్టేసాడు. ఆ మంటలు అంతటితో ఆగకుండా ఊరంతా చుట్టుముట్టేసాయి. వెంటనే స్పందించిన మంత్రి చెరువుగట్టు కోట్టేయించి మంటలార్పబోయాడు. కానీ ఏం లాభం, మీదలు కాలి - క్రిందలు నీటికి నాని,  రాజ్యం మొత్తం భూకంపం వచ్చినట్లు చెల్లాచెదురైపోయింది. 

                         అయినా పట్టువదలని విక్రమార్కుడిలా నగరాన్నంతా పునర్నిర్మించాడు మంత్రి. అయోమయం రాజు కూడా కొండని త్రవ్వి ఎలుకను పట్టి వర్జ్యసంహారం చేసానంటూ వీర విహారం చేస్తూ రాజ్యానికొచ్చాడు. ఎదురు సన్నాహాలతో మంత్రి తోడ్కొని తెచ్చాడు. 
 రాజ్యాన్నంతా క్రొత్తగా చూస్తున్నట్లుందని, రాజు వ్యాఖ్యానించడంతో 

"అయ్యా!  ఏం జరిగిందనుకున్నారు  అంటూ
   రాణిగారికి తేలుకుట్టడం దగ్గరనించి, రాజ్య నిర్మాణం దాకా అన్ని విషయాలు పూసగ్రుచ్చినట్లు చెప్పాడు మంత్రి. సెహభాష్ ! అంటూ మెచ్చుకున్నాడు రాజు.

కానీ రాజుగారికి కలిగిన సందేహం మంత్రిగారి సమాధానం విడవకుండా మీరు వినాలి, అప్పుడే  నిజమైన వర్జ్యానికి సార్ధకత చేకూరేది.

                       ఇంతకీ  రాజు అడిగిన సందేహం .... 
" సరేనయ్యా మంత్రీ!  కానీ చెరువులోని చేపలేమయ్యాయి?  

దానికి మంత్రి  సమాధానం ....
 " మహా ప్రభో చేపలన్నీ చెట్లెక్కి పోయాయి"
                             -:  ఇదండీ వర్జ్య సంహారం కథ. :-

 మరోసారి మరో కథనంతో నూటికి- వస్తాదును పరిచయం చేస్తా.....            

3, జూన్ 2013, సోమవారం

పదనిసలు-3

                                                      పదనిసలు-3
                    ఇంగ్లీష్ వాళ్లకి మనకి ముఖ్యమైన తేడా ఉంది. భాషలోనే కాదు భావాంతర్గత పద యదార్ధంలో కూడా, మాటాడితే మనం మనసు పదాన్ని వాడతాం, అఫ్ కోర్స్ ఫిజీషియన్ ని అడిగినా మనసు కోసి తీసి చూపించలేడు. అదే యదార్ధంగా ఆంగ్లంలో కూడా హార్ట్ , సోల్ ఉన్నాయి తప్ప మనసు లేదు. లోకంలోని వస్తు సంచయానికి ఎవరో ఒకరు పేరు పెట్టందే పేరైనా ఎలా నిలుస్తుంది.
            తెలుగు వారికి కాకి కావుకావు మనడం వినిపించింది. ఆంగ్లేయులకది క్రో అయింది. ఇద్దరికి దాని రవమే ఆధారం. కాకి, క్రో అన్న పదాలు సమానార్ధకాలుగా మనం గ్రహిస్తాం, కాకిని కాకి అనకుండా గీకి అని పిలవలేమా? అలా పిలవాలంటే ఆధారం కావాలిగా," పదుగురాడు మాట పాడియై ధరజెల్లు - ఒక్కడాడు మాట ఎక్కదెందు." కనుకనే కొత్తపదాలు పుట్టించడానికి సాహసం చేయరు.
            కొంతమంది కాల్పనికులు, ఆధునిక భావావేశం కలవాళ్ళు అవసరానికి అనుగుణమైన ఇతివృత్తాలను, కొత్త పదాలను సృజించగల సమర్ధులు. కాల గర్భంలో వారి సృజనా సామర్ధ్యంతో అవి నిఘంటువులలోకి ఎక్కిపోతాయి. కాస్త మనసు పెట్టి ఆలోచించే వారికి పదార్ధాల యదార్ధాలు నిజమే అనిపిస్తాయి. శాశ్వతత్వం సంతరించుకుంటేనే మీన్ పది కాలాలు నిలబడే పదార్ధాలు యదార్ధాలవుతాయి.
           అలాగే కాలం మహత్తర స్వస్థతకారి. పదానికి గల అర్ధాన్ని కూడా మార్చేసి వేరొక అర్ధాన్ని స్ఫురింప జేస్తుంది."సుత్తి" అనే పదానికి  ఆంగ్ల సమానార్ధకంలో చెప్పుకుందాం - హేమర్ -- టూల్  అనే అర్ధాలు ధర్మార్ధకాలు.కానీ సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు సినీ రంగ ప్రవేశంతో సుత్తికి గల యదార్ధం పోయి, బోరు కొట్టడం అనే విశేషార్ధం ఏర్పడింది. అంతెందుకు ధర్మార్ధకమే దారి తప్పింది. ధర్మం అనే మాటకు నేటి మస్తిష్కాలలో అడుక్కున్న వాడికిచ్చే అర్ధో రూపాయో అనే అర్ధమే సామాన్యమై పోయింది.
            ధర్మదేవత ఏడుస్తుందన్నా ఆవిడెవరు కోర్టులో న్యాయం చేస్తామంటారు తప్ప ధర్మ భిక్ష పెట్టరు. చూసారా నేను కూడా ధర్మం అనే మాటని పెట్టేది గానో ఇచ్చేది గానో పద ప్రయోగం చేసాను తప్ప ధర్మార్ధ వివరణ దారి తప్పించాను. దేశ, కాల, మాన పరిస్థితుల కారణంగా శాశ్వతత్వం సంపాదించుకున్న పదార్ధాల యదార్ధాలు కూడా పెర్ష్యబుల్స్ గానో, డ్యూరబుల్స్ గానో మారిపోతున్నాయి. మారిపోతున్న లోకానికి అందుకోలేని పరుగు పందానికి పదార్ధ యదార్ధాలు కనుమరుగై పోతాయేమో ! మనమీద ఉన్న ఆంగ్ల ప్రభావం అలాంటిది. అందుకే నేటి వ్యాకరణం వంద వత్సరాల క్రితం నాటి భాషని మాత్రమే సూత్రీకరించ గలుస్తోంది.
                భాష ప్రవాహం లాంటిది నిరంతర యానంలో తరంతర అభినివేశంతో ఒడిదుడుకుల ఒడ్డులరసి ఒరిసి ప్రవహించే నదిలా ఉంటుంది కాబట్టే ఎప్పటికప్పుడు  భాషా సంస్కరణలు అనేక తరహా వ్యాకరణ గ్రంధాలు పుట్టుకొస్తున్నాయి. చర్విత చర్వణం అని మీరనుకున్నా అప్పటి నన్నయగారి తెలుగు భాషకు సంస్కృతంలో వ్యాకరణం వ్రాసుకో వలసి వచ్చింది. ఏం చేస్తాం అచ్చతెనుగు పదాలు వాటి సంఖ్య పదార్ధ యదార్ధాలు బహు స్వల్పంగా ఉన్న తరుణంలో రాజరాజ నరేంద్రుడు ఉద్గ్రంధమైన మహా భారతాన్ని తెలుగులో వ్రాయమన్నాడు. ఎంత పిండికి అంతే రొట్టవుతుంది కాని పెద్దది చెయ్యడమెలా ? అందుకే తొలి తెలుగు వ్యాకరణం ఆంధ్ర శబ్ధ చింతామణి పేరిట సంస్కృతంలో వ్రాయబడి తత్సమ, తద్భవాలను సూత్రీకరించి కొంత రూపాంతరమొనర్చి శబ్ధ శాశనుడగు నన్నయ తెలుగు భాషను విస్తృత పరిచాడు.
                   భాషలోనైనా త్వరిత గతిని మార్పు చెందనిది క్రియ . కానీ మన తెలుగు భాషలో క్రియా పదాలు సైతం శతాబ్ధాలతో పాటుగా దశాంతరమయ్యాయి. ఉదాహరణకు చూడండి " వచ్చుచు నున్నవాడు రాఘవుడు " ఇది నన్నయగారి ప్రయోగం . తిక్కనగారి కాలం నాటికే  " వచ్చుచున్నాడు" గా పరిభ్రమించింది . తదనంతర కాలంలో " వస్తున్నాడు" గా స్థిరీకరించింది. నేటి కాలానికి " వస్తండు" గా రూపాంతరం చెందింది.
                   ఇక వ్యాకరణంలో సూత్రీకరణలు నిలుస్తాయి. భాషా యోషా ప్రవాహానికి చమత్కారం చూడగలరు, దినపత్రిక తిరగేసినా 2013 ఫిల్మోత్సవం - శీర్షిక బాగానే ఉంది. ఫిల్ము - ఆంగ్ల పదం, ఉత్సవం - తత్సమం  రెండూ కలిపితే గుణమెలా వచ్చిందో తెలియదు. సరి పెట్టుకుందామంటే ఫిల్ముత్సవం కాదు, అందున ఫిల్మ్ కు ఉత్వము ఎలా వచ్చిందో ? అందుకే అంటాను నేటి మన వాడుక భాషకి మనం నేర్చుకునే వ్యాకరణం చాలదు. సరికదా ఆంగ్ల సమానార్ధకాలను తెలుగులో పుట్టించాలంటే .......   వర్జ్య సంహారం చేయల్సిందే.
                                      ........... కథనంతో మళ్లీ కలుస్తా.....